కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించిన సీఎండీ ఎన్.బలరామ్
Singareni:
పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ సంఖ్యలో ప్రదేశాలను పరిశుభ్రం చేసినందుకు సింగరేణి కాలరీస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్పెషల్ క్యాంపెన్ 4.O లో ఎక్కువ ప్రాంతాలను పరిశుభ్ర పరిచిన (మ్యాగ్జిమమ్ నెంబర్ ఆఫ్ సైట్స్ క్లీన్డ్ ) విభాగంలో అవార్డు వరించింది. ఢిల్లీలో బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్ శివిర్ లో భాగంగా మంగళవారం రాత్రి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ శ్రీ ఎన్. బలరామ్ ఈ అవార్డును స్వీకరించారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోలిండియా, అనుబంధ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ సంస్థల్లో గత ఏడాది అక్టోబరు 2వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెన్ 4.0 పేరిట స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 157 చోట్ల పరిసరాలను పరిశుభ్రం చేయడాన్ని స్వీయ లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. అయితే 216 ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ప్రదేశాలను శుభ్ర పరచిన విభాగంలో ఈ పురస్కారం లభించింది.
సింగరేణి చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమానికి గుర్తింపు లభించడంపై సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. దేశ ఇంధన అవసరాలకు బొగ్గు ఎంత అవసరమో.. ఆరోగ్య భారతావనికి పరిశుభ్రత అంతే అవసరమన్నారు. సింగరేణి పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపేందర్ బ్రార్, శ్రీమతి విస్మితా తేజ్, సింగరేణి జీఎం శ్రీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.