Bandi Sanjay : కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి : బీజేపీ నేత బండి సంజయ్ పిలుపు

0
82

మేనిఫెస్టో పవిత్ర గ్రంథమని మాట ఇచ్చి రైతులను మోసం చేస్తారా?ఎన్నికల హామీలను అమలు చేయకుండా మళ్లీ దేవుడి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తామంటూ డ్రామాలాడతారా?రైతులు, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంగతి తేలుస్తరు.తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే
-ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు

దేవుళ్లంటే మీకు అలుసా

-పంట నష్టపోతే పరిహారం నేటికీ అందని దుస్థితి

-కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

-హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్

-వడ్ల కొనుగోలులో పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నారని వాపోయిన రైతులు

-ఎమ్మెస్పీ కంటే రూ.5 వందలు తక్కువగా దళారులకు అమ్మాల్సి వస్తోందని ఆవేదన

మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చిన బండి సంజయ్

ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా తమకు పవిత్ర గ్రంథమని, అందులో పొందుపర్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు.. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ప్రమాణం చేస్తున్నరు… నేనడుగుతున్నా.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దేవుళ్లను, భగవద్గీత, బైబిల్, ఖరాన్ లను వాడుకుంటారా? ఎన్నికలైపోంగనే వాటిని గాలికొదిలేస్తారా? దేవుళ్లంటే మీకు అంత చులకనా?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు

ఈరోజు ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ వడ్ల కొనుగోలు కేందాన్ని సందర్శించారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏకరవు పెట్టారు. ‘’సార్.. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నం. అధికారులు ఎంత చెప్పినా వడ్లలో కటింగ్ పెడుతున్నరు. వానొస్తే భయమైతుంది. టార్పాలిన్లు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాల్లేవు. తాలు, తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నరు. ఇవన్నీ మీలాంటోళ్లకు చెబుదామంటే రైతులను ఇక్కడున్నోళ్లు భయపెడుతున్నారు. దీంతో రైతులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. రైతులే దేశానికి వెన్నుముక అంటరు.. రైతుల వెన్నుపూస ఇరగ్గొడుతున్నరు. రైతుల ఆవేదనను విన్నబండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ముఖ్యాంశాలు

నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలవల్ల చాలా ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. వాళ్ల బాధలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. వానలతో ఎంతో కొంత వడ్లు తడిస్తే… దానిని పట్టుకుని ఇక్కడికి వచ్చి వడ్లన్నీ తడిశాయంటూ.. పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నరు. క్వింటాలుకు 10 కిలోల దాకా కోత పెడుతున్నరు.. ప్రభుత్వం పైకి మాత్రం రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నయి. కచ్చితంగా వడ్లలో గంప గుత్తగా కటింగ్ పెడుతున్నరు. కనీస మద్దతు కూడా రైతులకు దొరకడం లేదు. 16 నుండి 17 వందలకే వడ్లు కొనే దుస్థితి ఏర్పడింది.

ఎన్నికల మేనిఫెస్టో తమకు బైబిల్, ఖరాన్, భగవద్గీతతో సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మళ్లీ మోసం చేస్తున్నరు. నేనడుగుతున్న తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందే మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?

వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హమీ ఇచ్చారు. వడ్లతోపాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వడానికి రూ. 5వేల కోట్ల నిధులు కావాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లన్నీ కొనాలంటే ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు హామీల అమలు కోసం రూ.5700 కోట్ల నిధులు అవసరం. వాటినే ఖర్చు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు కోసం రూ.30 వేల కోట్లను విడుదల చేస్తామంటే నమ్మేదెవరు? తక్కువ బడ్జెట్ లో ఇచ్చిన హామీలనే అమలే చేయని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15లోపు రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మేదెవరు? అసలు కాంగ్రెస్ పార్టీకి దేవుడి మీద, బైబిల్, భగవద్గీత, ఖురాన్ మీద విశ్వాసం ఉందా? ఉంటే ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్లకు బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. అట్లాగే తడిసిన వడ్లను పూర్తిగా కనీస మద్ధతు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

కాంగ్రెస్ హయాంతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం కనీస మధ్దతు ధరను రెట్టింపు చేశారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు రూ.20 వేల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా రైతుపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here